Revanth Reddy: మాజీ మంత్రి టి.దేవేందర్ గౌడ్ ను కలిసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం జరిగింది. హైదరాబాదులో మాజీ మంత్రి టి.దేవేందర్ గౌడ్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిశారు. ఈ భేటీపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో అందరినీ కలుపుకుంటూ పోతామని, ఈ కార్యాచరణలో భాగంగానే దేవేందర్ గౌడ్ ను కలిశామని స్పష్టం చేశారు. రాజకీయ విలువలకు ప్రతిరూపం వంటి వ్యక్తి దేవేందర్ గౌడ్ అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు కృషి చేసిన నేత అని, ఆయన ఆశీస్సులు తమకు అవసరం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ దారితప్పిందని, రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టాలంటే అలాంటి వారి సూచనలు, సలహాలు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. వాస్తవానికి కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన ప్రప్రథమంగా చేసింది దేవేందర్ గౌడ్ అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాగా, రేవంత్ రెడ్డితో పాటు దేవేందర్ గౌడ్ ను కలిసిన వారిలో పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి, పీసీసీ ప్రచార కమిటీ చీఫ్ మధుయాష్కీ గౌడ్ కూడా ఉన్నారు.
Revanth Reddy
T Devendar Goud
Congress
Telangana

More Telugu News