ఉపాధి లేక ఉసూరుమంటున్న నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు: నారా లోకేశ్

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఏపీ సర్కారుపై మరోసారి ధ్వజమెత్తారు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట తప్పారని విమర్శించారు. సీఎం వైఖరి పట్ల నిరసనగా నిరుద్యోగులు శాంతియుత ఆందోళన చేయడాన్ని ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందని తెలిపారు.

జాబ్ క్యాలెండర్ విడుదల కోసం ఉద్యమిస్తున్నాడన్న కక్షతో విజయనగరం జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శిని తప్పుడు ఆరోపణలతో 107 సెక్షన్ కింద బైండోవర్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని లోకేశ్ పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన పౌరహక్కులను గొంతు నులిమివేయడమేనని విమర్శించారు. ఇకపై ఉద్యోగాల కోసం, విద్యార్థుల హక్కుల కోసమో నిరసన తెలిపే వీల్లేకుండా రూ.50 వేలు డిపాజిట్ చేయాలని అప్రజాస్వామిక ఆదేశాలిచ్చిన తహసీల్దార్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని వెల్లడించారు.

"జగన్ గారూ... ఉపాధి లేక ఉసూరుమంటున్న నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడొద్దు. మీరు ఉద్యోగాలు ఇవ్వలేరని తేలిపోయింది. ఉద్యోగాల కోసం ఉద్యమించిన వాళ్ల గొంతు ఇలా తప్పుడు కేసులు, తప్పుడు నిర్ణయాలతో నొక్కేస్తూ, ఎన్నాళ్లీ అరాచకం సాగిస్తారు?" అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nara Lokesh
Jagan
AP Govt
Unemployment
Andhra Pradesh

More Telugu News