Asaduddin Owaisi: మోహన్ భగవత్ పై అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు

Owaisi comments on Mohan Bhagawat
  • ముస్లిం సమాజంపై ద్వేష భావం హిందుత్వ నుంచే వచ్చింది
  • ముస్లిం వ్యతిరేకులకు హిందూ ప్రభుత్వ మద్దతు ఉంది
  • నేరస్థులకు అధికార పార్టీ మద్దతిస్తోందనే విషయం అందరికీ తెలుసు
ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ పై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ముస్లిం సమాజంపై ద్వేషభావం హిందుత్వ నుంచి వచ్చిందని ఆయన అన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న నేరస్థులకు హిందూ ప్రభుత్వ మద్దతు ఉందని ఆరోపించారు. ముస్లింలపై దాడులకు పాల్పడేవారు హిందువులు కారని మోహన్ భగవత్ అంటున్నారని... అయితే ముస్లింలకు వ్యతిరేకంగా నేరాలు చేస్తున్న వారికి అధికార పార్టీ మద్దతు ఇస్తోందనే విషయం అందరికీ తెలుసని చెప్పారు.

గో రక్షకుల పేరుతో ఎందరో ముస్లింలపై దాడులు జరిగాయని ఒవైసీ అన్నారు. 2015లో మొహమ్మద్ అఖ్లఖ్ హత్య, 2017లో పెహ్లూ ఖాన్ పై దాడి, 2018లో అలీముద్దీన్ మృతి వంటివి ఈ దారుణాలకు కొన్ని ఉదాహరణలను చెప్పారు. అలీముద్దీన్ ను చంపిన నేరస్థులను ఒక కేంద్ర మంత్రి పూలదండలతో సత్కరించారని మండిపడ్డారు. ఈ మేరకు ఒవైసీ ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు.

మరోవైపు మోహన్ భగవత్ మాట్లాడూతూ భారత్ లో ఇస్లాం ప్రమాదంలో చిక్కుకుందని ముస్లింలు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. హిందువులైనా, ముస్లింలైనా భారతీయుల డీఎన్ఏ ఒక్కటేనని అన్నారు.
Asaduddin Owaisi
MIM
Mohan Bhagawat
RSS

More Telugu News