TTD: తిరుమలలో 79 రోజులుగా నిలిచిపోయిన సర్వదర్శనం!

Tirumala devotees urge ttd to increase online tickets
  • కరోనా కారణంగా ఏప్రిల్ 12 నుంచి నిలిచిపోయిన సర్వదర్శనాలు
  • ఆన్‌లైన్ టికెట్ల కోటా 15 వేలకు పరిమితం చేసిన టీటీడీ
  • నేరుగా వచ్చే భక్తులకు తప్పని తిప్పలు
తిరుమలలో సామాన్య భక్తులకు శ్రీవారం దర్శనం కరవైంది. కరోనా విజృంభణ కారణంగా శ్రీవారి సర్వ దర్శనాలు నిలిచిపోవడమే ఇందుకు కారణం. కరోనా రెండో దశ విజృంభణ కారణంగా ఏప్రిల్ 12 నుంచి సర్వదర్శనాలను టీటీడీ నిలిపివేసింది. ఇప్పటి వరకు వాటిని పునరుద్ధరించకపోవడంతో పేదలు, సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.

మరోవైపు, ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ తగ్గించింది. మే నెలలో రోజుకు 15 వేల టికెట్లను మాత్రమే జారీ చేసింది. టికెట్లు కొనుగోలు చేసినప్పటికీ కరోనా వైరస్ భయంతో చాలా మంది తిరుమల రాలేకపోయారు. దీంతో జూన్ నెలలో రోజుకు ఐదు వేల టికెట్లను మాత్రమే జారీ చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం.. జులైలోనూ అదే సంఖ్యలో టికెట్లను జారీ చేస్తోంది. ఫలితంగా నేరుగా తిరుమల వచ్చే భక్తులు సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు పొందేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికి 79 రోజులుగా సర్వదర్శనం నిలిచిపోవడంతో టికెట్ల కోటాను పెంచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
TTD
Tirumala
Tirupati
Devotees
Online Tickets

More Telugu News