శ్రీశైలంకు చెందిన అయ్యప్పరెడ్డి వద్దే నేను జూనియర్ గా చేరాను: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

I started my career with Ayyappa Reddy says CJI NV Ramana
  • అయ్యప్పరెడ్డి కుటుంబం వల్లే ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాను
  • ప్రతి ఏడాది రెండు, మూడు సార్లు శ్రీశైలంకు వస్తాను
  • కర్నూలు జిల్లా అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈరోజు శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. సీజేఐగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి శ్రీశైలం ఆలయాన్ని దర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వారం రోజులుగా తెలుగు గడ్డపై తిరుగుతూ తాను ఎంతో సంతోషాన్ని పొందుతున్నానని చెప్పారు. తాను న్యాయవాద వృత్తిని చేపట్టిన తొలినాళ్లలో శ్రీశైలం ప్రాంతానికి చెందిన ఏరాసు అయ్యప్ప రెడ్డి వద్ద జూనియర్ గా చేరానని చెప్పారు. ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నందుకు అయ్యప్పరెడ్డికి, ఆయన కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.

కర్నూలు జిల్లా అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని జస్టిస్ రమణ తెలిపారు. ఈ జిల్లా నుంచే న్యాయవాద వృత్తిని ప్రారంభించి, అంచెలంచలుగా ఎదిగానని చెప్పారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి ఏడాది రెండు, మూడు సార్లు శ్రీశైలంకు వచ్చి స్వామిని, అమ్మవారిని దర్శించుకుంటున్నానని తెలిపారు. తాను శ్రీశైలంకు వస్తున్నానని చెప్పిన వెంటనే... అన్ని ఏర్పాట్లు చేసిన ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లికి, స్థానిక ఎమ్మెల్యే, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని జస్టిస్ రమణ చెప్పారు.
Go Back to Shorts
Justice Ramana
CJI
Sri Sailam

More Telugu News