పాల వ్యాపారం చేసేవాడివి ఇంత పెద్దోడివి ఎలా అయ్యావ్? నిన్ను వదిలి పెట్టం: మంత్రి మల్లారెడ్డికి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడి వార్నింగ్

  • మల్లారెడ్డి ఆసుపత్రి కట్టిన స్థలం ఆయనది కాదు
  • ప్రభుత్వ స్థలంలో ఆసుపత్రి కట్టారు
  • ఆయన అక్రమ నిర్మాణాల భాగోతాలను బయటపెడతాం
తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలుమూరి వెంకట్ తీవ్ర ఆరోపణలు చేశారు. పాల వ్యాపారం చేసే స్థాయి నుంచి మల్లారెడ్డి ఇంత పెద్దోడు ఎలా అయ్యాడని ఆయన ప్రశ్నించారు. మల్లారెడ్డిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మల్లారెడ్డి ఆసుపత్రి ముందు ధర్నా చేస్తే... డాక్టర్లపై దాడి చేశామంటూ తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. అయితే తమ పోరాటానికి మల్లారెడ్డి తలొగ్గారని... ఆయన ఆసుపత్రిలో కరోనాకు ఉచితంగా చికిత్స చేస్తామని ప్రకటించారని... అది తమ విజయమని చెప్పారు.

మల్లారెడ్డి ఆసుపత్రి కట్టిన స్థలం ఆయనది కాదని... అది ప్రభుత్వ భూమి అని వెంకట్ అన్నారు. తాను కూడా ఎంబీబీఎస్ విద్యార్థినేనని... డాక్టర్లపై తామెందుకు దాడి చేస్తామని ప్రశ్నించారు. డాక్టర్లపై దాడి చేశామని చెబుతున్నవారు దానికి సంబంధించిన వీడియోలను ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీశారు. కరోనా వైద్యాన్ని తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. మల్లారెడ్డి తమపై పెట్టిన అక్రమ కేసులకు తాము భయపడబోమని అన్నారు. ఆయన అక్రమ నిర్మాణాల భాగోతాలను బయటపెడతామని... ఆయనను వదిలే ప్రసక్తే లేదని చెప్పారు.


More Telugu News

Malla Reddy TRS NSUI Balumuri Venkat