ముగ్గురాయి గనుల్లో పేలుడుతో 10 మంది చనిపోవడం విషాదకరం: పవన్ కల్యాణ్

  • కడప జిల్లాలో దుర్ఘటన
  • జిలెటిన్ స్టిక్స్ పేలి 10 మంది మృతి
  • ఈ ఘటన హృదయాన్ని కలచివేసిందన్న పవన్
  • గనుల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి
కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె శివారు ప్రాంతంలో ఉన్న ముగ్గురాయి గనుల్లో భారీ పేలుడు సంభవించి 10 మంది మృత్యువాత పడిన ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

ముగ్గురాయి గనుల్లో జిలెటిన్స్ స్టిక్స్ పేలి పది మంది చనిపోయారన్న వార్త హృదయాన్ని కలచివేసిందని పేర్కొన్నారు. ఇది విషాదకరమైన ఘటన అని, ఈ ఘటనలో చనిపోయిన వారిని గుర్తించలేని పరిస్థితి ఉందంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని అన్నారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి మామిళ్లపల్లె దుర్ఘటన చోటుచేసుకున్న ముగ్గురాయి గనుల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయబద్ధమైన పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

2018లో కర్నూలు జిల్లా హత్తిబెళగల్ లో ఓ గనిలో పేలుడు జరిగి ఇదే రీతిలో 12 మంది చనిపోయారని, ఇలాంటి ఘటనలు జరుగుతున్నా గనుల యజమానులు కార్మికుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని పవన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తాజా ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా గనుల వద్ద రక్షణ ఏర్పాట్లపై ప్రభుత్వం తక్షణమే విచారణ చేయించాలని స్పష్టం చేశారు.


More Telugu News

Pawan Kalyan Blast Explosion Mining Kadapa District