Arvind Kejriwal: కంగ్రాచ్యులేషన్స్ మమతా దీదీ... బెంగాల్ లో మీదే ప్రభంజనం: సీఎం కేజ్రీవాల్

Delhi CM Arvind Kejriwal congratulates West Bengal CM Mamata Banarjee
  • బెంగాల్ లో కొనసాగుతున్న కౌంటింగ్
  • 200 దాటిన టీఎంసీ ఆధిక్యం
  • 77 స్థానాల్లో బీజేపీ ముందంజ
  • ఏమి పోరాటం! అంటూ కేజ్రీవాల్ ప్రశంసలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ముందస్తు అభినందనలు తెలిపారు. "కంగ్రాచ్యులేషన్స్ మమతా దీదీ... బెంగాల్ లో ప్రభంజనం సృష్టిస్తున్నారు. నిజంగా ఏమి పోరాటం!" అని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఢీ అంటే ఢీ అనేలా తలపడుతూ, 8 విడతల అసెంబ్లీ ఎన్నికలను ఆమె నిబ్బరంతో ఎదుర్కొన్నారు. దానికి తగ్గట్టే కౌంటింగ్ ట్రెండ్స్ వెలువడుతున్నాయి.

మధ్యాహ్నం 1.40 గంటల సమయానికి తృణమూల్ 210 స్థానాల్లో ముందంజ వేయడమే కాకుండా, ఒక స్థానంలో విజయం సాధించింది. ఈసారి ఎన్నికల్లో టీఎంసీతో హోరాహోరీ పోరు సాగించిన బీజేపీ... అధికార పక్షానికి దరిదాపుల్లో లేకున్నా గణనీయమైన స్థాయిలోనే ఉనికిని చాటుకుంటోంది. ఆ పార్టీ ప్రస్తుతం 77 స్థానాల్లో ముందంజలో ఉంది. ఒక స్థానంలో నెగ్గింది.

అటు, నందిగ్రామ్ లో సీఎం మమతా బెనర్జీపై ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ, ఆధిక్యం రౌండు రౌండుకు చేతులు మారుతోంది. దాంతో విజయంపై ఉత్కంఠ ఏర్పడింది.
Arvind Kejriwal
Mamata Banerjee
Landslide Victory
West Bengal
Assembly Elections

More Telugu News