Serum Institute: మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన వ్యాక్సిన్‌ కొవిషీల్డ్‌: సీరం ఇన్‌స్టిట్యూట్‌

Serum responds on row over vaccine Price
షార్ట్స్‌లో చూడండి
కరోనా టీకా కొవిషీల్డ్ ధరల విషయంలో వస్తున్న విమర్శలపై దాని తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) నేడు స్పందించింది. ఈ టీకాను ఇతర దేశాలు కొనుగోలు చేసిన ధరతో పోలిస్తే భారత్‌లోనే దీని ధర ఎక్కువన్న వాదనను తోసిపుచ్చింది. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన వ్యాక్సిన్‌ కొవిషీల్డేనని తెలిపింది.

ప్రైవేటు ఆస్పత్రులకు డోసుకు రూ.600 చొప్పున కొన్ని టీకాల్ని మాత్రమే విక్రయిస్తామని తెలిపింది. కొవిడ్‌ చికిత్సకు కావాల్సిన ఇతర ఔషధాలు, అత్యవసర మందులతో పోలిస్తే ఈ వ్యాక్సిన్‌ ధర చాలా తక్కువని తెలిపింది. ఈ మేరకు సీరం శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది.

టీకా అభివృద్ధి సమయంలో కొన్ని దేశాలు నిధులు సమకూర్చాయని, అందుకే తొలినాళ్లలో ఆయా దేశాలకు టీకాలను చాలా తక్కువ ధరకు విక్రయించామని తెలిపింది. భారత్‌తో పాటు వివిధ దేశాల్లో ప్రభుత్వాలు చేపట్టిన తొలి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలకు తక్కువ ధరకే టీకాలు అందించామని పేర్కొంది.

ప్రస్తుతం పరిస్థితి భయానకంగా ఉందని సీరం తన ప్రకటనలో అభిప్రాయపడింది. వైరస్‌ రోజురోజుకీ రూపాంతరం చెందుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో టీకా ఉత్పత్తి నిరంతరాయంగా, స్థిరంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ తయారీ సామర్థ్యాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇందుకోసం పెట్టుబడి కావాలని తెలిపింది.

తాజా కొనుగోలు ఒప్పందం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వాలకు కొవిషీల్డ్‌ టీకాను ఒక్కో డోసును రూ.400కు విక్రయించనున్న విషయంపై  ఓ ప్రముఖ పత్రికలో విమర్శనాత్మక కథనం ప్రచురితమైంది. దీన్ని ఉటంకించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌.. భారత్‌లో తయారైన టీకాలకు ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఎక్కువ ఎందుకని ప్రశ్నించారు. దీంతో ధరలపై వివాదం మొదలైంది.

దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం భారత్‌లో అందుబాటులోకి వచ్చిన రెండు టీకాలను ఒక్కో డోసును రూ.150కే కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన టీకాలను రాష్ట్ర ప్రభుత్వాలకు ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించింది.
Go Back to Shorts
Serum Institute
Covishield
coronavirus
COVID-19

More Telugu News