NIA: నిన్న తెలుగు రాష్ట్రాల్లో 31 చోట్ల సోదాలు నిర్వహించాం: ఎన్ఐఏ ప్రకటన

  • బుధవారం ఏపీ, తెలంగాణల్లో ఎన్ఐఏ సోదాలు
  • తీవ్ర కలకలం రేపిన సోదాలు 
  • హార్డ్ డిస్కులు, ఇతర ఉపకరణాలు స్వాధీనం
  • కొన్ని ఆయుధాలు, మావోయిస్టు సాహిత్యం స్వాధీనం
NIA statement on searches in Telugu states

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బుధవారం నాడు ఎన్ఐఏ సోదాలు నిర్వహించడం తీవ్ర కలకలం రేపింది. సోదాలపై ఎన్ఐఈ నేడు ఓ ప్రకటన చేసింది. నిన్న తెలుగు రాష్ట్రాల్లో 31 చోట్ల సోదాలు జరిపినట్టు వెల్లడించింది. ఏపీలో శ్రీకాకుళం, ప్రకాశం, తూర్పు గోదావరి, కర్నూలు, కడప, కృష్ణా, గుంటూరు... తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ జిల్లాల్లో సోదాలు చేసినట్టు వివరించింది.

ఈ సోదాల్లో 40 మొబైల్ ఫోన్లు, 44 సిమ్ కార్డులు, 70 హార్డ్ డిస్కులు, మైక్రో ఎస్డీ కార్డులు, 19 పెన్ డ్రైవ్ లు, ఒక ఆడియో రికార్డర్, రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. ఇవే కాకుండా కొన్ని ఆయుధాలు, మావోయిస్టు సాహిత్యం, జెండాలు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ తెలిపింది. కాగా, మావోయిస్టు సానుభూతిపరులు, విప్లవ సంఘాల నేతలు, వారి సంబంధీకుల ఇళ్లలో ఎన్ఐఏ ఈ సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది.

More Telugu News