స్వాతంత్ర్యం వచ్చి 74 ఏళ్లయినా లక్షలాది మందికి న్యాయ సాయం అందట్లేదు: సుప్రీం జడ్జి జస్టిస్​ ఎన్వీ రమణ

Justice Ramana says millions in India still have no access to justice
  • ఇప్పటికీ పేదరికం పోలేదని ఆవేదన
  • ఎన్నో వేదికలపై చర్చ జరిగినా ఫలితం లేదని కామెంట్
  • న్యాయవాదులంతా బలహీన వర్గాల గొంతుకవ్వాలని పిలుపు
  • నల్సా 25వ వార్షికోత్సవంలో ప్రసంగం
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 ఏళ్లవుతున్నా ఇప్పటికీ కొన్ని లక్షల మంది జనం న్యాయసాయానికి నోచుకోవట్లేదని సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. జనానికి న్యాయం అందేలా న్యాయవాదులంతా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) 25వ వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రెండు సమస్యలతో పోరాడుతున్నామన్నారు. పేదరికం, న్యాయసాయం అందకపోవడం వంటివి ఇప్పటికీ ఉన్నాయన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాల గురించి మాట్లాడినా ఇప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికీ వాటిపైనే మాట్లాడాల్సి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో ఈ విషయాలు ఎప్పుడో మరుగున పడిపోవాల్సినవని, అయినా ఇప్పటికీ వాటితో మనం పోరాడుతూనే ఉన్నామని రమణ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ కొన్ని లక్షల మందికి న్యాయ సాయం అందడం లేదన్నారు. సమాజంలో బలహీన వర్గాల వారి గళాలను లాయర్లంతా వినిపించాలని పిలుపునిచ్చారు.

వీలైనచోటల్లా వారికి తోడ్పాటును అందించాలని సూచించారు. విచారణలకు అవసరమయ్యే ఫీజును భరించలేని వారికి సాయం చేయాలన్నారు. సమాజానికి ఎంతో కొంత వెనక్కు ఇచ్చేలా, ప్రజలకు సేవ చేసేలా న్యాయవాదులు కృషి చేయాలని రమణ పిలుపునిచ్చారు.
Go Back to Shorts
Supreme Court
Justice Ramana
Justice
Independence
NALSA

More Telugu News