న్యాయవాది ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన లారీ.. హత్యాయత్నమన్న బాధితుడు

  • హైదరాబాద్ నుంచి వరంగల్ కు వెళ్తున్న లాయర్ దుర్గాప్రసాద్
  • వెనుక నుంచి వచ్చి కారును ఢీకొన్న లారీ
  • తనకు హాని కలిగించేందుకు దాడికి పాల్పడ్డారన్న లాయర్
పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు లాయర్ వామనరావు దంపతులను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు మరొక లాయర్ పై హత్యాయత్నం జరగడం చర్చనీయాంశంగా మారింది.

 హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై హైకోర్టు లాయర్ దుర్గాప్రసాద్ ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. వరంగల్ లో భూవివాదానికి సంబంధించిన ఓ కేసును వాదించేందుకు ఆయన తన కారులో బయలుదేరారు. జనగామ మండలం యశ్వంత్ పూర్ వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ ఆయన కారును ఢీకొంది. కొంత దూరం వరకు కారును లారీ లాక్కెళ్లింది. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు.

జరిగిన ఘటనపై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. తన ప్రాణాలకు హాని కలిగించేందుకే ఈ దాడికి పాల్పడినట్టు ఫిర్యాదు చేశారు. మరోవైపు లారీ డ్రైవర్ కు స్థానికులు దేహశుద్ధి చేశారు. అతన్ని పోలీసులకు అప్పగించారు.  బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులకు డ్రైవర్ చెప్పినట్టు సమాచారం.

Lawyer
Durga Prasad
Accident
Murder Attempt

More Telugu News