వ్యాక్సిన్​ జాతీయవాదం చాలా ప్రమాదకరం.. ప్రపంచానికి 9.2 లక్షల కోట్ల డాలర్ల నష్టం: డబ్ల్యూహెచ్​ వో

vaccine nationalism is too dangerous says who chief
  • ధనిక దేశాలపైనే రూ.3.3 కోట్ల కోట్ల ప్రభావం ఉంటుందని హెచ్చరిక
  • పేద దేశాలకూ వ్యాక్సిన్లను సరఫరా చేయాలని కోరిన సంస్థ చీఫ్ టెడ్రోస్
  • వాటికి టీకాలు ఇవ్వకపోతే మహమ్మారి తిరగబెట్టే ముప్పుందని హెచ్చరిక
  • ఆరోగ్యం సరుకు కాదని చురకలు
  • ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని వెల్లడి
రాబోయే రోజుల్లో పెను సవాళ్లు ఎదురు కాబోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి డాక్టర్ టెడ్రోస్ అధనోం ఘెబ్రియేసస్ అన్నారు. శుక్రవారం ప్రపంచ ఆర్థిక వేదిక దావోస్ ఎజెండాలో ఆయన మాట్లాడారు.

మొదటి వంద రోజుల్లో ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది, వృద్ధులకు కరోనా టీకాలు వేస్తున్నామని, మరో 71 రోజుల టైమే మిగిలి ఉందని, అది చాలా తక్కువని ఆయన అన్నారు. కాబట్టి ప్రతి క్షణమూ విలువైనదేనని అన్నారు. టీకాలు పేద దేశాలకూ అందేలా చర్యలు తీసుకోవాలని, వ్యాక్సిన్ జాతీయవాదం చాలా ప్రమాదకరమని అన్నారు.

కరోనా మహమ్మారిని అంతం చేయాలంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు మాత్రమే పనిచేస్తే దానిని అంతం చేయలేమని, ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఆరోగ్యం అన్నది సరుకు కాదని, ఖరీదైన వస్తువు అంతకన్నా కాదని కరోనా నిరూపించిందన్నారు. ఆరోగ్యం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని తేల్చి చెప్పారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థిరత్వానికి ఆరోగ్యమే పునాది రాయి అన్నారు.

ఇప్పటికే వ్యాక్సిన్ డోసులను పొందిన ధనిక దేశాలు డబ్ల్యూహెచ్ వో ప్రారంభించిన ‘కొవ్యాక్స్’ గ్రూపునకు టీకాలు సరఫరా చేయాలని కోరారు. దాని వల్ల పేద దేశాలకూ కరోనా వ్యాక్సిన్ అందుతుందన్నారు. ‘టీకా జాతీయవాదం’ చాలా ప్రమాదకరమైందని టెడ్రోస్ హెచ్చరించారు. దాని వల్ల వేరే దేశాలకు టీకాలు అందవని, దీంతో మళ్లీ మహమ్మారి తిరగబెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

టీకా జాతీయవాదంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై 9.2 లక్షల కోట్ల డాలర్ల (సుమారు 6.7 కోట్ల కోట్ల రూపాయలు) ప్రభావం పడుతుందని, ధనిక దేశాలకే 4.5 లక్షల కోట్ల డాలర్ల (సుమారు 3.3 కోట్ల కోట్ల రూపాయలు) మేర నష్టం వాటిల్లుతుందని ఇటీవలి ఐసీసీడబ్ల్యూబీవో పరిశోధన సంస్థ అధ్యయనంలో తేలిందన్నారు. కాబట్టి టీకా జాతీయవాదాన్ని నిరోధించాలని టెడ్రోస్ కోరారు.

వ్యాక్సిన్లపై దుష్ప్రచారాలను తిప్పి కొట్టేలా ఫేస్ బుక్, గూగుల్ తో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. సాలిడరిటీ రెస్పాన్స్ ఫండ్ పై ప్రైవేట్ రంగ సంస్థలూ ఆసక్తి చూపించాయన్నారు. కాగా, శుక్రవారానికి కరోనా ఆత్యయిక స్థితిని ప్రకటించి ఏడాది అయిందని ఆయన గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు.
Go Back to Shorts
WEF
WHO
Tedros Adhanom Ghebreyesus
COVID19

More Telugu News