బాలు మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించడం ఆయన కీర్తిని మరింత పెంచింది: పవన్ కల్యాణ్

  • పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం
  • ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్
  • హర్షం వ్యక్తం చేసిన పవన్
  • సినీ సంగీతంపై బాలు ముద్ర చెరగనిదని వ్యాఖ్యలు
కేంద్రం నిన్న ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులు ప్రకటించడంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రతిభావంతులకు పట్టంకట్టే విధంగా పద్మ పురస్కారాల ఎంపిక సాగిందని వెల్లడించారు. గాన గంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మవిభూషణ్ ప్రకటించడం ముదావహం అని పేర్కొన్నారు. సినిమా సంగీతంపై బాలు చెరగని ముద్రవేశారని కొనియాడారు. మరణానంతరం ఈ పురస్కారానికి ఎంపిక చేయడం ఆయన కీర్తిని మరింత పెంచిందని అభిప్రాయపడ్డారు.

ప్రముఖ గాయని కేఎస్ చిత్రకు పద్మభూషణ్ ప్రకటించడం హర్షణీయమని, గత నాలుగు దశాబ్దాలుగా దక్షిణాది భాషల సహా పలు భాషల్లో పాటలు పాడి శ్రోతలను మైమరపించారని వివరించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పద్మ అవార్డులకు ఎంపికైన అన్నవరపు రామస్వామి, నిడుమోలు సుమతి, ఆశావాది ప్రకాశరావు, కనకరాజులకు పవన్ కల్యాణ్ అభినందనలు తెలియజేశారు.

Pawan Kalyan
SP Balasubrahmanyam
Padma Vibhushan
Posthumous

More Telugu News