Jagan: దేవుడితో చెలగాటం వద్దు.. కఠినంగా శిక్షిస్తాడు: ఆలయాలపై దాడులపై సీఎం జగన్

ఏపీలో హిందూ ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు కలకలం రేపుతున్నాయి. దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, మత విద్వేషాలను రగలించేలా దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో విగ్రహాల విధ్వంసంపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. జరుగుతున్న దారుణ ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేవాలయాలు, విగ్రహాలపై దాడులు దారుణమని సీఎం అన్నారు. దేవుడితో చెలగాటం ఆడొద్దని... దేవుడితో పెట్టుకుంటే కఠినంగా శిక్షిస్తాడని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ ఘటనలకు పాల్పడిన దుండగులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలను ఇస్తామని జగన్ చెప్పారు. ఇంటి పట్టా రాలేదని ఎవరూ బాధ పడొద్దని అన్నారు. పట్టా రాని వారు అధికారులను సంప్రదించి, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ అధికారులు పట్టాలు ఇవ్వాలని అన్నారు.
Jagan
YSRCP
Hindu Temples

More Telugu News