తెలంగాణలో ఒకటి నుంచి ఐదో తరగతికి ఈ ఏడాది ఇక బడులు లేనట్టే!

  • స్కూళ్లు తెరిచినా తల్లిదండ్రులు పంపించే అవకాశం లేదని భావిస్తున్న ప్రభుత్వం
  • పిల్లలు భౌతిక దూరం పాటించే అవకాశం లేదని భావన
  • వారి వల్ల ఇంట్లోని పెద్దలు ప్రమాదం బారినపడే అవకాశం
  • 9-10 తరగతులకు మాత్రం కనీసం 90 రోజులు విద్యాబోధన అందించాలని యోచన
కరోనా వైరస్ కారణంగా మూతపడిన స్కూళ్లు తెరిచే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పాఠశాలలు తెరిచినా తమ పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు తల్లిదండ్రులు అంగీకరించకపోవచ్చని భావిస్తున్న ప్రభుత్వం ఒకటి నుంచి 5 తరగతులకు స్కూళ్లు తెరవకూడదని నిర్ణయించింది. ప్రైవేటు స్కూళ్లను కూడా ఇందుకు అనుమతించరాదని యోచిస్తోంది.

పాఠశాలలు కనుక ప్రారంభిస్తే పిల్లలు భౌతిక దూరం పాటించడం అసాధ్యమని, పిల్లలు కనుక వైరస్ బారినపడితే ఇంట్లోని పెద్దలకు కూడా అది సంక్రమించే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి ఐదో తరగతి వరకు ఈ విద్యాసంవత్సరంలో బడులు ప్రారంభించకపోవడమే మంచిదని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఒకటి నుంచి ఐదు తరగతులు చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో 11.36 లక్షల మంది ఉండగా, ప్రైవేటు పాఠశాలల్లో ఈ సంఖ్య 15 లక్షల వరకు ఉందని అంచనా. ఇక, నర్సరీ-యూకేజీ మధ్య చదువుతున్న వారు ఆరేడు లక్షల మంది వరకు ఉంటారు. వీరందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆరు నుంచి 8 తరగతులకు పరిస్థితులను బట్టి ప్రత్యక్ష బోధనపై నిర్ణయం తీసుకుంటారు. 9-10 తరగతుల విద్యార్థులకు మాత్రం కనీసం 90 రోజులు, గరిష్ఠంగా 120 రోజులపాటు ప్రత్యక్ష బోధన అందించాలని భావిస్తున్నారు.

Telangana
primary schools
Corona Virus
closed

More Telugu News