మహమ్మారి వల్ల కలిగిన నష్టం రూ.866 లక్షల కోట్లు: ఆక్స్ ఫామ్ నివేదిక

  • 36 ధనిక దేశాలకు అధిక నష్టం
  • అల్పాదాయ దేశాల అదనపు వ్యయం 4,200 కోట్ల డాలర్లు
  • పెరిగిన నిరుద్యోగం, తగ్గిన పని గంటలు
ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు రూ. 866 లక్షల కోట్ల (సుమారు 11.7 లక్షల కోట్ల డాలర్లు) నష్టం వాటిల్లిందని ఆక్స్ ఫామ్ తన తాజా నివేదికలో అంచనా వేసింది. ఇదంతా ఈ సంవత్సరం ప్రపంచం చెల్లించుకున్న అదనపు మూల్యమని పేర్కొంది. మొత్తం నష్టంలో దాదాపు 83 శాతం నష్టం 36 ధనిక దేశాలకు ఏర్పడిందేనని పేర్కొంది. 56 అల్పాదాయ దేశాలు ఈ మొత్తంలో కేవలం 0.4 శాతం వాటాగా, 4,200 కోట్ల డాలర్లు నష్టపోయాయని తెలిపింది.

ఈ అదనపు వ్యయంలో అధిక భాగం సామాజిక సంక్షేమం కోసం ఖర్చయిందని, 28 సంపన్న దేశాల్లోని ప్రజల్లో ఒక్కొక్కరిపై 695 డాలర్లు ఖర్చయిందని వెల్లడించింది. ఇదే సమయంలో పేద, మధ్య తరగతి దేశాలు ఒక్కొక్కరిపై 4 నుంచి 28 డాలర్ల వరకూ వెచ్చించాయని ఆక్స్ ఫామ్ అంచనా వేసింది.

ఇక, పని గంటలు తగ్గడం, లాక్ డౌన్, కంపెనీల మూసివేత కారణంగా ఆసియా పసిఫిక్ దేశాల్లో 8.10 కోట్ల మంది తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నారని ఐఎల్ఓ (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్) తెలిపింది. కరోనా మహమ్మారి ప్రజల ఆదాయం, ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొంది. కరోనా సోకకముందుతో పోలిస్తే పనిగంటలు 15 శాతానికి పైగా తగ్గాయని, ఇంకా పూర్తి స్థాయిలో ఏ రంగమూ పుంజుకోలేదని తెలిపింది.

Corona Virus
World
Economy
Oxfam
Report

More Telugu News