Gangula Pratap Reddy: మా రాయలసీమకు హైకోర్టు అవసరంలేదు.. మాకు ప్రత్యేక రాష్ట్రమే కావాలి: గంగుల ప్రతాపరెడ్డి

Gangula Pratap Reddy comments in Greater Rayalaseema
  • గ్రేటర్ రాయలసీమపై వ్యాఖ్యలు
  • కర్నూలును ఎందుకు రాజధాని చేయలేదన్న గంగుల
  • సీమ ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకోవాలి  
  • ప్రత్యేక రాయలసీమే మాకు ముద్దు 
  • గతంలో తాను ఇదే ప్రస్తావన తెచ్చానని వెల్లడి
రాయలసీమ బీజేపీ నేత గంగుల ప్రతాపరెడ్డి ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్నూలు నగరాన్ని రాజధానిగా ఎందుకు నిర్ణయించలేదో సీఎం జగన్ చెప్పాలని ప్రశ్నించారు. విశాఖకు రాయలసీమకు సంబంధమే లేదని అన్నారు. తమకు హైకోర్టు అవసరంలేదని, తమకు ప్రత్యేక రాష్ట్రమే కావాలని డిమాండ్ చేశారు. రూ.45 వేల కోట్లను తాము కోరుకోవడంలేదని, ప్రత్యేక రాయలసీమే తమకు ముద్దు అని స్పష్టం చేశారు.

విజయవాడ, విశాఖలో భూములు కొనే స్థితిలో సీమ ప్రజలు లేరని తెలిపారు. గ్రేటర్ రాయలసీమ ఉద్యమాన్ని యువత ముందుకు తీసుకెళ్లాలని గంగుల పిలుపునిచ్చారు. సీమ ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

1991లోనే గ్రేటర్ రాయలసీమపై పార్లమెంటులో ప్రస్తావించానని ఆయన వెల్లడించారు. 2007లో గ్రేటర్ రాయలసీమకు వైఎస్సార్ సుముఖత వ్యక్తం చేశారని పేర్కొన్నారు. రాయలసీమ అంశంపై 2013లో సోనియా గాంధీకి లేఖ రాశానని, మన్మోహన్ సింగ్ కూడా సమర్థించారని తెలిపారు.
Gangula Pratap Reddy
Greater Rayalaseema
Telangana
Kurnool
Jagan
Andhra Pradesh

More Telugu News