KTR: తెలంగాణ ప్రజలకు దీపావళి కానుకను ప్రకటించిన కేటీఆర్

  • జీహెచ్ఎంసీలో రూ. 15 వేల వరకు ఆస్తిపన్నుపై 50 శాతం రాయితీ
  • ఇతర పట్టణాల్లో రూ. 10 వేల పన్ను వరకు 50 శాతం రాయితీ
  • జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ. 17,500కు పెంపు
KTR announces property tax discounts

దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం కానుకను ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 2020-21 సంవత్సరానికి గాను రూ. 15 వేల వరకు ఆస్తిపన్నును చెల్లించే గృహ యజమానులకు 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో రూ. 10 వేల వరకు ఇంటిపన్ను చెల్లించేవారికి కూడా 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లించిన వారికి వచ్చే ఏడాది చెల్లించాల్సిన పన్నులో మినహాయింపును ఇస్తామని చెప్పారు. దీని వల్ల రాష్ట్రంలోని 31.40 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది వర్షాలు పడ్డాయని కేటీఆర్ అన్నారు. ఇప్పటి వరకు 4,75,871 కుటుంబాలకు రూ. 475 కోట్ల సాయం చేశామని చెప్పారు. వరద సాయం అందని వారు మీసేవలో నమోదు చేసుకోవాలని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు సాయం అందిస్తారని చెప్పారు. అవసరమైతే మరో రూ. 100 కోట్ల సాయం అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇదే సమయంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. కార్మికుల వేతనాన్ని రూ. 14,500 నుంచి రూ. 17,500కు పెంచుతున్నామని ప్రకటించారు.

More Telugu News