బీజేపీని చూసి ఎక్కువగా ఆందోళన చెందొద్దు: పార్టీ నేతలతో కేసీఆర్

  • బీజేపీని చూసి హైరానా పడొద్దు
  • ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదు
  • బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
దుబ్బాక ఉపఎన్నికలో గెలుపు తర్వాత బీజేపీలో కొత్త ఉత్సాహం నెలకొంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ కు షాకిస్తామని... సత్తా చాటుతామని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ శ్రేణులకు కేసీఆర్ ధైర్యాన్ని నూరిపోశారు. బీజేపీ విషయంలో ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. దుబ్బాక ఉపఎన్నికలో ఓటమిపై ముఖ్య నేతలతో కేసీఆర్ మేథోమధనం చేశారు. దీంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు, వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యానించారు.

దుబ్బాకలో బీజేపీ గెలుపు గురించి హైరానా పడొద్దని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఏమాత్రం వ్యతిరేకత లేదని చెప్పారు. బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని... వారి ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలని అన్నారు.

మరోవైపు రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. హైదరాబాద్ వరదలు, వర్షాల వల్ల పంట నష్టంపై ఈ భేటీలో చర్చించనున్నారు. డిసెంబర్ తొలి వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించే యోచనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

KCR
Donald Trump
Dubbaka
GHMC Elections

More Telugu News