కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం.. వరంగల్ లో ఉత్తమ్ దిష్టిబొమ్మ దగ్ధం!

  • దుబ్బాకలో మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్
  • కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారని కార్యకర్తల ఆగ్రహం  
  • విజయశాంతి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం
దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ తర్వాత మూడో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా కాజీపేట మండలంలో ఉత్తమ్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. దుబ్బాక ఓటమికి ఉత్తమ్ కుమార్ రెడ్డే కారణమని వారు మండిపడ్డారు. ఇతర పార్టీలకు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఈనెల 14న ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీలో ఆమె చేరుతున్నట్టు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లతో ఆమె భేటీ అయ్యారు. దుబ్బాకలో కాంగ్రెస్ తరపున ఆమె ప్రచారం కూడా నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో, బీజేపీలో చేరడానికే ఆమె హస్తినకు పయనమవుతున్నట్టు చెప్పుకుంటున్నారు.

Uttam Kumar Reddy
Vijayashanti
Congress
Effigy
BJP

More Telugu News