సోనూసూద్ సేవలను గుర్తించిన రామినేని ఫౌండేషన్... ప్రత్యేక పురస్కారం ప్రకటన!

  • లాక్ డౌన్ సమయంలో ఎందరినో ఆదుకున్న సోనూ సూద్
  • తన అవార్డు సొమ్మును కిడ్నీ బాధితుడికి ఇవ్వాలన్న సోనూ  
  • యాంకర్ సుమ, వేమూరి సుధాకర్, డాక్టర్ చింతల గోవిందరాజులుకు కూడా
కరోనా లాక్ డౌన్ కాలంలో పేదలను, ముఖ్యంగా వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరుకోవడంలో ఎంతో సాయం చేసి, తాను రియల్ లైఫ్ లో హీరోనని అనిపించుకున్న ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ సేవలకు గుర్తింపు లభించింది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక డాక్టర్ రామినేని ఫౌండేషన్, ఆయన్ను ప్రత్యేక పురస్కారంతో సత్కరించాలని నిర్ణయించింది.

డిసెంబర్ లేదా జనవరిలో ఈ పురస్కారాన్ని సోనూ సూద్ కు ప్రదానం చేయనున్నట్టు ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ వెల్లడించారు. ఈ సంవత్సరం పురస్కారాలను పొందిన వారి పేర్లను ఆయన ప్రకటించారు. నాబార్డు చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులును విశిష్ట పురస్కారానికి ఎంపిక చేశామని ఆయన తెలిపారు. ఆసియా బ్యాడ్మింటన్‌ టెక్నికల్‌ ఆఫీషియల్స్‌ కమిటీ డిప్యూటీ చైర్మన్‌ వేమూరి సుధాకర్‌, ద్వారకామయి ట్రస్ట్‌ ద్వారా సేవలందిస్తున్న బండ్లమూడి శ్రీనివాస్, యాంకర్ కనకాల సుమలను కూడా సత్కరిస్తామని తెలిపారు.

ప్రత్యేక, విశిష్ట పురస్కార విజేతలకు రూ. 2 లక్షల నగదు బహుమతిని, విశేష పురస్కార గ్రహీతలకు రూ. 1 లక్షను అందించనున్నామని ఆయన అన్నారు. కాగా, తనకు లభించే నగదు బహుమతిని, హైదరాబాద్ లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడికి అందించాలని సోనూ సూద్ ఇప్పటికే రామినేని ఫౌండేషన్ కు సూచించి, తనలోని పెద్ద మనసును మరోసారి చాటుకోవడం గమనార్హం.

Sonu Sood
Ramineni Foundation
USA
Award

More Telugu News