కాంగ్రెస్ నేతలు ఇప్పుడేమంటారు?... పుల్వామా ఘటనపై క్షమాపణలు చెబుతారా?: ప్రకాశ్ జవదేకర్

పాకిస్థాన్ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరి నిన్న పార్లమెంటులో ప్రసంగిస్తూ పుల్వామా దాడి తమ ఘనతే అని గొప్పగా చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. పుల్వామా ఘటనలో కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. పుల్వామా ఘటనపై అవమానకర రీతిలో మాట్లాడిన కాంగ్రెస్ పెద్దలు దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మొన్న ఫిబ్రవరికి పుల్వామా దాడి జరిగి ఏడాది పూర్తికాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మాట్లాడుతూ, భద్రతా లోపాలకు అధికార బీజేపీనే బాధ్యత వహించాలని, ఈ ఘటనతో అత్యధికంగా లబ్ది పొందింది ఎవరు? అంటూ వ్యాఖ్యలు చేశారు. అటు, కర్ణాటక కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ ఒకడుగు ముందుకు వేసి, పుల్వామా దాడి ఘటనను చూస్తుంటే పాకిస్థాన్ ప్రజలతో ప్రధాని మోదీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్టుందని అన్నారు.


More Telugu News