రివ్వున దూసుకుపోయిన 'నాగ్' అస్త్రం... గురితప్పకుండా లక్ష్యఛేదన

Nag anti tank missile test successful
  • రాజస్థాన్ లోని పోఖ్రాన్ రేంజిలో ప్రయోగం
  • త్వరలో భారత సైన్యంలోకి నాగ్ యాంటీ టాంక్ మిస్సైల్
  • ప్రయోగాల ఊపు పెంచిన డీఆర్డీఓ
భారత్ ఇటీవల ఆయుధ పాటవం పెంపుపై దృష్టి సారించింది. వరుసగా కీలక ఆయుధాల సన్నద్ధతను పరీక్షిస్తోంది. తాజాగా టాంకు విధ్వంసక క్షిపణి నాగ్ ను పరీక్షించింది. శరవేగంతో దూసుకెళ్లిన నాగ్ లక్ష్యాన్ని తుత్తునియలు చేసింది. తద్వారా భారత సైన్యంలో చేరికకు పూర్తిగా సిద్ధమైంది. ఈ యాంటీ టాంక్ గైడెడ్ మిస్సైల్ (ఏటీజీఎమ్)ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసింది.

ఇవాళ నాగ్ అస్త్రాన్ని ఆఖరిసారిగా పరీక్షించగా, గురితప్పకుండా లక్ష్యాన్ని తాకిందని డీఆర్డీఓ వెల్లడించింది. ఈ ప్రయోగాన్ని రాజస్థాన్ లోని పోఖ్రాన్ రేంజిలో నిర్వహించినట్టు తెలిపింది.  గత ఒకటిన్నర నెలల కాలంలోనే డీఆర్డీఓ 12 క్షిపణి ప్రయోగాలు నిర్వహించడం విశేషం. ఇవాళ నిర్వహించిన నాగ్ యాంటీ టాంక్ మిస్సైల్ ప్రయోగం ఓ మొబైల్ లాంచర్ ద్వారా చేపట్టారు.

నాగ్ 4 నుంచి 7 కిలోమీటర్ల పరిధిలోని శత్రు టాంకులను నామరూపాల్లేకుండా చేయగలదు. ఇది మూడవ తరం ఏటీజీఎమ్. పగలు, రాత్రి అని తేడా లేకుండా ఏ సమయంలోనైనా లక్ష్యాలపై దూసుకెళ్లే సత్తా దీని సొంతం.
Go Back to Shorts
Nag
ATGM
DRDO
Pokhran
India

More Telugu News