శ్రీనగర్ లో భూకంపం... భయకంపితులైన ప్రజలు!

  • గత రాత్రి భూకంపం
  • రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రత
  • కొన్ని చోట్ల ఆస్తి నష్టం
జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్, సమీప జిల్లాల్లో గత రాత్రి సంభవించిన భూకంపం ప్రజలను భయకంపితులను చేసింది. గత రాత్రి రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. భూమికి 5 కిలోమీటర్ల లోపల ప్రకంపనల కేంద్రం ఉందని, గత రాత్రి 9.40 గంటల సమయంలో భూకంపం వచ్చిందని ఎన్సీఎస్ వెల్లడించింది. ఈ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర ఆందోళన చెంది, ఇళ్ల నుంచి వీధుల్లోకి పరిగెత్తారు. రాత్రంతా వీధుల్లోనే గడిపారు.

"ఇది చాలా భయాన్ని కలిగించింది. ప్రతి ఒక్కరూ క్షేమంగానే ఉన్నారని అనుకుంటున్నాను" అని శ్రీనగర్ జిల్లా మేజిస్ట్రేట్ షాహీద్ చౌధురి తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. ఇక తాము ఎదుర్కొన్న పరిస్థితి గురించి పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో ఆస్తి నష్టం కూడా సంభవించిందని తెలుస్తుండగా, ప్రాణనష్టంపై మాత్రం సమాచారం అందలేదు.

Jammu And Kashmir
Srinagar
Earth Quake

More Telugu News