కరోనాతో వణుకుతున్న మహారాష్ట్ర.. మహమ్మారి బారిన 20 వేల మందికిపైగా పోలీసులు

  • 20 వేల మందిలో 2 వేలమందికిపైగా  అధికారులు
  • ఇప్పటి వరకు 208 మంది మృతి
  • నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి రూ. 25 కోట్ల జరిమానా వసూలు
కరోనా మహమ్మారి మహారాష్ట్రను వణికిస్తోంది. ప్రతి రోజూ వేలాది మంది వైరస్ బారినపడుతున్నారు. కరోనా నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసులు సైతం పెద్ద ఎత్తున ఈ మహమ్మారి బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 20 వేల మందికిపైగా పోలీసులు కరోనా బారినపడినట్టు అధికారులు నిన్న వెల్లడించారు. గత 24 గంటల్లోనే ఏకంగా 364 మంది వైరస్ బారినపడినట్టు పేర్కొన్నారు. అలాగే నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

కరోనా బారినపడిన 20 వేల మందికిపైగా పోలీసుల్లో 2 వేల మందికిపైగా అధికారులే ఉన్నట్టు అధికారులు తెలిపారు. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 208 మంది పోలీసులు మృతి చెందారు. మరణించిన వారిలోనూ 21 మంది ఉన్నతస్థాయి అధికారులు ఉన్నట్టు చెప్పారు. పోలీసు శాఖలో ఇంకా 3 వేలకుపైగా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు వివరించారు. అలాగే, 16 వేల మందికిపైగా పోలీసులు కోలుకున్నారు.

ఇక, కరోనా నిబంధనలు ఉల్లంఘించిన 2 లక్షల మందిపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. వీరిలో 34 వేల మంది అరెస్టయ్యారు. అలాగే, నిబంధనల ఉల్లంఘనుల నుంచి ఇప్పటి వరకు రూ. 25 కోట్ల జరిమానా వసూలు చేశారు.

Corona Virus
Maharashtra
Police
corona deaths

More Telugu News