మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం.. మిద్దె కూలి తల్లి, ఇద్దరు పిల్లల దుర్మరణం

  • వర్షాలకు పూర్తిగా నానిపోయిన మిద్దె
  • నిద్రిస్తుండగా ఒక్కసారిగా కూలిన మిద్దె
  • అక్కడికక్కడే మృతి చెందిన తల్లీకూతుళ్లు
మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంటి మట్టి మిద్దె కూలిన ఘటనలో తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు మృతి చెందారు. జిల్లాలోని గండేడు మండలంలోని పగిడ్యాల గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. గ్రామానికి చెందిన జొన్నల శరణమ్మ (35), పెద్ద కుమార్తె  భవానీ (13), చిన్న కుమార్తె వైశాలి (9)తో కలిసి ఓ ఇంట్లో నివసిస్తోంది.

 గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో వారి ఇంటి మిద్దె పూర్తిగా నానిపోయింది. ఈ తెల్లవారుజామున వారు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా కూలి వారిపై పడింది. ప్రమాదంలో తల్లీకూతుళ్లు ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News

Mahabubnagar Telangana House collapese