ప్రణబ్ ముఖర్జీకి బ్రెయిన్ సర్జరీ... పరిస్థితి ఆందోళనకరం!

Pranab Mukharjee On Ventilator after Brain Surgery
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి గత రాత్రి బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఆయన మెదడులో రక్తం గడ్డకట్టిందని తెలుసుకున్న వైద్యులు, ఇతర పరీక్షలు నిర్వహించగా, ఆయనకు కరోనా కూడా సోకినట్టు గుర్తించారు. మెదడుకు శస్త్రచికిత్స చేయగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది.

శస్త్రచికిత్స విజయవంతమైనా, 84 సంవత్సరాల వయసులో ఉన్న ఆయనకు, కరోనా వైరస్ కారణంగా ఇతర అవయవాల పనితీరు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్ పై ఉంచామని, ప్రత్యేక వైద్య బృందం అనుక్షణం పరిశీలిస్తోందని న్యూఢిల్లీలో ఆర్మీ నిర్వహణలో ఉన్న ఆర్ అండ్ ఆర్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

కాగా, నిన్న ఉదయం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా ట్వీట్ చేసిన ప్రణబ్ ముఖర్జీ, తనకు కరోనా సోకిందని, గడచిన వారం రోజులుగా తనను కలిసి వారంతా స్వీయ నియంత్రణలోకి వెళ్లి, పరీక్షలు చేయించుకోవాలని కోరిన సంగతి తెలిసిందే. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం కుదుటపడాలని, ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా కోరుకుంటున్నారు. ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని, ఆయన త్వరగా కోలుకుంటారన్న నమ్మకం తనకుందని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ వ్యాఖ్యానించారు.

కాగా, చాలాకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగిన ఆయన, భారత ఆర్థిక వ్యవస్థపై, జాతి నిర్మాణంపై పలు పుస్తకాలను రచించారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు. 2008లో పద్మ విభూషణ్ అవార్డును స్వీకరించిన ప్రణబ్, అంతకు 11 సంవత్సరాల ముందే 1997లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును స్వీకరించారు. 2011లో బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అవార్డును కూడా పొందారు.
Go Back to Shorts
Pranab Mukherjee
Brain Surgery
Hospital
Corona Virus

More Telugu News