మంత్రి, ఎమ్మెల్సీ పదవులకు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా

mopidevi pilli resign
  • రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ నేతలు
  • ఎమ్మెల్సీ పదవుల రాజీనామా లేఖలు మండలి కార్యదర్శికి అందజేత
  • మంత్రి పదవుల రాజీనామా లేఖలను జగన్‌కు పంపిన నేతలు
  • ఏపీకి  ప్రత్యేక హోదా సాధ్యం కాదేమోనన్న పిల్లి సుభాష్ 
రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ నేతలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ తమ ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్సీలుగా వారిద్దరు సీఎం జగన్‌ కేబినెట్‌లోనూ కొనసాగుతోన్న విషయం విదితమే. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన 14 రోజుల్లోగా తమ పదవులకు వారు రాజీనామా చేయాల్సి ఉండడంతో ఎమ్మెల్సీ పదవుల రాజీనామా లేఖలను మండలి కార్యదర్శికి అందజేశారు. వీరి ఎమ్మెల్సీ పదవుల రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోద ముద్ర వేశారు. అలాగే, మంత్రి పదవుల రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు పంపారు.

వైసీపీ ప్రభుత్వంలో ఏడాదిగా చాలా సంతృప్తిగా పని చేశానని ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాకు చెప్పారు. తన శాఖకు సంబంధించి సీఎం జగన్ ఎన్నడూ జోక్యం చేసుకోలేదని ఆయన చెప్పారు. జగన్‌ తనకు తన శాఖ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, మండలి‌ రద్దయ్యే వరకు మంత్రిగా కొనసాగినా అభ్యంతరం లేదని చెప్పారని తెలిపారు. తాను చాలా కాలంగా ఎంపీగా పార్లమెంట్‌కు వెళ్లాలనుకుంటున్నానని చెప్పారు. కాగా, ఏపీకి  ప్రత్యేక హోదా సాధ్యం కాదేమోనని తాను భావిస్తున్నట్లు తెలిపారు.

ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో పాటు పాటు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్‌ నత్వాని ఎన్నికయ్యారు.
Go Back to Shorts
Pilli Subhas Chandra Bose
Mopidevi Venkataramana
YSRCP

More Telugu News