జగన్ కు, నాకు మధ్య చిచ్చు పెట్టొద్దు.. జనాలు చూస్తున్నారు: విజయసాయిపై రఘురామకృష్ణరాజు ఫైర్
- నాపై పత్రికల్లో దొంగరాతలు రాయిస్తున్నారు
- ఎంపీనైన నన్ను శిక్షించాలనుకుంటున్నారు
- వీలైతే నోటీసులు వెనక్కి తీసుకోండి
'అయ్యా విజయసాయిరెడ్డి గారూ... నేనొక క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తను. క్రమశిక్షణ కలిగిన ఎంపీని. మీరు పత్రికల్లో నాపై ఎన్ని దొంగరాతలు రాయించినా... ఆ దొంగరాతలను చూశారా, చూశారా అంటూ పదేపదే చెప్పినా... నేను ఏనాడు పార్టీని కానీ, పార్టీ అధినేత జగన్ ను కానీ వ్యతిరేకించలేదు. ఈ విషయాన్ని పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన నన్ను శిక్షించాలని మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి' అంటూ రఘురామ కృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పార్టీ అధినేత జగన్ కు, తనకు మధ్య మనస్పర్థలు కలిగించవద్దని, చిచ్చు పెట్టొద్దని మిమ్మల్ని వేడుకుంటున్నానని విజయసాయిని ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని... వీలైతే మీరు ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకోవాలని మీకు మీడియా ముఖంగా చెపుతున్నానని అన్నారు.