భారత్ లో లాక్ డౌన్ ను వేరే దేశాల లాక్ డౌన్ లతో పోలుస్తూ.. గ్రాఫ్ సాయంతో రాహుల్ గాంధీ విమర్శలు

  • కరోనా కట్టడికి లాక్ డౌన్ ప్రకటించిన కేంద్రం
  • అయినా ప్రయోజనం కనిపించలేదని రాహుల్ వ్యాఖ్యలు
  • ఇతర దేశాలతో పోల్చితే భారత్ విఫలమైందని వెల్లడి
కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యాక నరేంద్ర మోదీ సర్కారు తీసుకున్న చర్యలు తుస్సుమన్నాయని, లాక్ డౌన్ ఓ విఫలయత్నం అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినా ప్రయోజనం శూన్యమని, ఇతర దేశాలతో పోల్చితే లాక్ డౌన్ ప్రకటించి మోదీ సర్కారు సాధించిందేమీ లేదని వ్యాఖ్యానించారు.

అంతేకాదు, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, యూకే దేశాలతో పోలుస్తూ  భారత్ లో కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ అమలును వివరిస్తూ   రాహుల్ ఓ గ్రాఫ్ ను కూడా ట్వీట్ చేశారు. ఆయా దేశాల్లో కరోనా క్రమంగా పెరుగుతూ ఉన్నప్పుడు లాక్ డౌన్ ప్రకటించి.. బాగా తగ్గుదల కనిపించినప్పుడు లాక్ డౌన్ ఎత్తివేసిన  తీరును గ్రాఫ్ ద్వారా విడమర్చారు. అదే ఇండియాలో మాత్రం కరోనా విజృంభిస్తున్న తరుణంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తీరును గ్రాఫ్ ద్వారా చూపించారు.

ప్రస్తుతం భారత్ లో 2.37 లక్షల కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, 1.14 లక్షల మంది కోలుకున్నారు. 6 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, భారత్ లో తొలి లక్ష కేసులకు నెలరోజులకు పైగా సమయం పట్టగా, రెండో లక్ష కేసులు కేవలం రెండు వారాల సమయంలోనే నమోదయ్యాయి. ఈ అంశాన్నే రాహుల్ గాంధీ తన గ్రాఫ్ ద్వారా వెల్లడించే ప్రయత్నం చేశారు.

Rahul Gandhi
Narendra Modi
Centre
Corona Virus
Graph
India

More Telugu News