ప్రాణం తీసిన భ్రమ.. తుపాకితో కాల్చుకుని యువకుడి మృతి

  • మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఘటన
  • పుట్టిన రోజు వేడుకల్లో కనిపించిన తుపాకి
  • భరత్ షేరే అనే వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు
భ్రమ ఓ యువకుడి ప్రాణం తీసింది. తన కంటపడిన తుపాకిని బొమ్మ తుపాకిగా భావించిన అతడు తనను కాల్చుకుని మృతి చెందాడు. మహారాష్ట్ర, థానే జిల్లాలోని షాహాపూర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. అటగావ్‌లోని రెసిడెన్షియల్ కాలనీలో ఓ వ్యక్తి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. పక్క ఫ్లాట్‌లో ఉంటున్న సిద్ధేశ్ జనగం (28) దీనికి హాజరయ్యాడు.

ఈ సందర్భంగా ఇంట్లో తుపాకి కనిపించడంతో దానిని చేతుల్లోకి తీసుకుని పరిశీలించాడు. బొమ్మ తుపాకిగా భావించి తన తలకు గురిపెట్టుకుని, సరదాగా ట్రిగ్గర్ నొక్కాడు. వెంటనే లోపలి నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ అతడి శరీరాన్ని ఛిద్రం చేసింది. కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. తుపాకి పేలిన శబ్దానికి అందరూ అక్కడికి చేరుకోగా సిద్ధేశ్ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. తుపాకిని భరత్‌షేరే అనే వ్యక్తికి సంబంధించినదిగా గుర్తించి కేసు నమోదు చేశారు.


More Telugu News

Maharashtra Thane Gun dead Crime News