ఆంధ్రా యూనివర్సిటీలో కుల వివక్ష దారుణం: నారా లోకేశ్

Nara Lokesh responds on Andhra University issue
  • ప్రొఫెసర్ ప్రేమానందంపై కులం పేరుతో దాడి చేశారన్న లోకేశ్
  • ఇది రాజారెడ్డి రాజ్యాంగం అంటూ లోకేశ్ విమర్శలు
  • జగన్ ప్రజావ్యతిరేక పాలనపై తిరుగుబాటు తప్పదని హెచ్చరిక
ఆంధ్రా యూనివర్సిటీలో దళిత ప్రొఫెసర్ డాక్టర్ ప్రేమానందంపై కులం పేరుతో దాడి చేశారంటూ నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయూలో ప్రొఫెసర్ ప్రేమానందంను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో కుల వివక్ష దారుణమని వ్యాఖ్యానించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి వైఎస్ జగన్ తన తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతల దౌర్జన్యాలు, అణచివేతలతో దళితులు దగాపడ్డారని లోకేశ్ మండిపడ్డారు.

కచ్చులూరు బోటు ప్రమాదంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ ఎంపీ హర్షకుమార్ పై అక్రమ కేసులు పెట్టారని, దళితులపై అక్రమాలను నిలదీసిన మహాసేన రాజేశ్ పై రౌడీషీట్ తెరిచారని వివరించారు. మాస్కులు అడిగిన దళిత వైద్యుడు సుధాకర్ ను ఉగ్రవాది కంటే ఘోరంగా బంధించి హింసించారని తెలిపారు. దళితుల గొంతును నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తున్న జగన్ నిరంకుశ ప్రజావ్యతిరేక పాలనపై తిరుగుబాటు తప్పదని లోకేశ్ హెచ్చరించారు.

Go Back to Shorts
Nara Lokesh
Castism
Andhra University
Prof Premanandam
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News