కోహ్లీ కంటే సచినే గొప్ప: గంభీర్

  • గత పవర్ ప్లే నిబంధనలు కఠినమని పేర్కొన్న గంభీర్
  • అలాంటి పరిస్థితుల్లోనూ సచిన్ మేటిగా రాణించాడని కితాబు
  • ఇప్పటి పవర్ ప్లే రూల్స్ బ్యాట్స్ మన్లకే అనుకూలం అని వ్యాఖ్యలు
ఇటీవల కాలంలో క్రికెట్లో ఏ బ్యాట్స్ మన్ నైనా పోల్చాలంటే విరాట్ కోహ్లీతో పోల్చి చూడడం పరిపాటిగా మారింది. కోహ్లీ సాధించిన రికార్డులు, అతడి నైపుణ్యం, దృక్పథమే అందుకు కారణం. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ పండితులు కోహ్లీ వంటి ఆటగాడు చరిత్రలో మరొకరు ఉండరంటూ కీర్తించడం సాధారణ విషయంగా మారింది. అయితే, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాత్రం కోహ్లీ కంటే సచిన్ టెండూల్కరే గొప్ప ఆటగాడని అంటున్నాడు. వన్డేల్లో కోహ్లీతో పోల్చితే సచినే మిన్నగా భావించాలని పేర్కొన్నాడు.

సచిన్ ఆడిన కాలంలో పవర్ ప్లే నిబంధనలు ఎంతో కఠినంగా ఉండేవని, మ్యాచ్ లో ఒక బంతి మాత్రమే ఉండేదని, పవర్ ప్లేలో నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఇన్ సైడ్ సర్కిల్ లో ఉండేవారని గంభీర్ తెలిపాడు. ఇప్పుడలా కాదని, రెండు తెల్ల బంతులు ఇస్తున్నారని, దాంతో బంతి పాతబడడం తగ్గి రివర్స్ స్వింగ్ సాధ్యం కావడంలేదని వెల్లడించాడు. దానికితోడు మూడు పవర్ ప్లేలు ఉంటున్నాయని, 1 నుంచి 10వ ఓవర్ వరకు 30 గజాల సర్కిల్ ఆవల ఇద్దరు ఫీల్డర్లకే అనుమతి ఉంటుందని, రెండో పవర్ ప్లేలో నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని, చివరి పవర్ ప్లేలో ఐదుగురికి మాత్రమే సర్కిల్ ఆవల ఫీల్డింగ్ చేసే వెసులుబాటు ఉంటుందని గంభీర్ వివరించాడు.

ఇలాంటి పరిస్థితుల్లో ఓ బ్యాట్స్ మన్ ఎంతో సులువుగా పరుగులు రాబట్టగలడని, అందుకే గత నిబంధనలతో ఆడిన సచినే ఎంతో గొప్ప అని భావిస్తానని తెలిపాడు. కోహ్లీ సాధించిన పరుగులు కూడా అద్భుతమని, కానీ మారిన నిబంధనలు బ్యాట్స్ మెన్ కే అధికంగా లాభిస్తున్నాయన్న విషయం మరువరాదని పేర్కొన్నాడు.

Gautam Gambhir
Sachin Tendulkar
Virat Kohli
Batting
Powerplay

More Telugu News