Chandrababu: సీఎం చేస్తోన్న వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగించేలా ఉంటున్నాయి!: జగన్ పై చంద్రబాబు ఫైర్

కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. ప్రజల జీవితాలతో ఆడుకోవడం మంచి పద్ధతి కాదు. ప్రజలు అసలే కరోనా భయంతో ఉంటే సీఎం చేస్తోన్న వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగించేలా ఉంటున్నాయి. కరోనా తగ్గదు.. రాష్ట్రంలోని అందరికీ కరోనా వస్తుందేమోనని జగన్ అన్నారు' అని వ్యాఖ్యానించారు.

'కరోనా అందరికీ రావాలని జగన్ కోరుకుంటున్నారా? జాగ్రత్తలు తీసుకోలేరా మీరు? నేను మొదటి నుంచే చెబుతున్నాను. కరోనా వ్యాప్తి నివారణపై శ్రద్ధ పెట్టాలని. కంటోన్మెంట్‌ జోనులు పెట్టాలని నేను మొదట్లోనే చెప్పాను. కరోనాను కట్టడి చేయాలని అనేక సూచనలు చేశాను. పట్టించుకోలేదు' అని చంద్రబాబు చెప్పారు.

'ప్రజల జీవితాలతో ఆడుకోవడం సరికాదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలన్నీ సక్రమంగా అమలు చేయాలి. లాక్‌డౌన్‌ నిబంధనలు వైసీపీ నేతలకు పట్టవా? రాష్ట్రంలో అనేక దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అనేక విషయాల్లో బుద్ధి, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ చూసినా దోపిడీ చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎదురుతిరుగుతున్నారు' అని మండిపడ్డారు.
Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News