India: కోవిడ్-19 తర్వాత నిరుద్యోగ, నిరుపేద భారతం: అర్థర్ డి.లిటిల్ నివేదికలో వెల్లడి

  • దేశంలో 13.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు
  • మళ్లీ పేదరికంలోకి 12 కోట్ల మంది
  • 7.6 శాతం నుంచి 35 శాతానికి నిరుద్యోగిత
Arthur D little says Job loss in India grow to 35 percent

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ భారత్‌లోనూ అలజడి రేపుతోంది. మహమ్మారి కారణంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఈ వైరస్ ప్రభావం భారత్‌లోనూ దారుణంగా ఉంటుందని అంతర్జాతీయ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ అర్థర్ డి.లిటిల్ పేర్కొంది. కోవిడ్-19 కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్‌లో 13.5 కోట్ల ఉద్యోగాలకు ప్రమాదం పొంచి ఉందని అంచనా వేసింది. అలాగే, 12 కోట్ల మంది పేదరికంలోకి జారుకుంటారని తెలిపింది. తలసరి ఆదాయం క్షీణిస్తుందని, తద్వారా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పడిపోతుందని పేర్కొంది.

2021-2022లో వృద్ధి రేటు 0.8 శాతంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. ‘భారత్: కోవిడ్-19తో ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించడం: కోవిడ్-19 అనంతరం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి, శక్తిమంతం చేయడానికి 10 పాయింట్ల కార్యక్రమం’ పేరుతో రూపొందించిన నివేదికలో ఈ విషయాలను ప్రస్తావించింది. నిరుద్యోగం ప్రస్తుతం ఉన్న 7.6 శాతం నుంచి 35 శాతానికి పెరిగే అవకాశం ఉందని, ఫలితంగా 13.5 కోట్ల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని తెలిపింది. మొత్తంగా 17.4 కోట్ల మంది నిరుద్యోగులుగా మారతారని, 12 కోట్ల మంది పేదరికంలోకి జారుకోగా, 4 కోట్ల మంది నిరుపేదలుగా మారతారని అర్థర్ డి.లిటిల్ అంచనా వేసింది.

More Telugu News