శ్రామిక్ రైళ్లపై రాజకీయాలొద్దంటూ సోనియాకు లేఖ రాసిన ఏఐఆర్ఎఫ్

AIRF writes a letter to Sonia Gandhi
  • రైల్వే శాఖకు ఇటీవల లేఖ రాసిన సోనియా గాంధీ
  • రైల్వే  ఎంతో శ్రమించి కార్మికులను తరలిస్తోంది
  • రాజకీయ ప్రయోజనాల కోసం మంచి వ్యవస్థను అస్థిరపరచొద్దని వినతి
వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు డబ్బులు తీసుకుంటున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే శాఖకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇటీవల ఓ లేఖ రాశారు. రైళ్లను ఉచితంగా నడపాలని, అవసరమైతే ఆ డబ్బులు తాము ఇస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈ విషయమై అఖిల భారత రైల్వే మెన్ సమాఖ్య (ఏఐఆర్ఎఫ్) స్పందిస్తూ సోనియాకు ఓ లేఖ రాసింది. వలస కార్మికులను తరలిస్తున్న శ్రామిక్ రైళ్ల విషయంలో రాజకీయాలు చేయొద్దని ఆ లేఖలో కోరింది. ‘కరోనా’ వ్యాపించి ఉన్న పరిస్థితుల్లో రైళ్లలో ప్రయాణం అత్యంత ప్రమాదకరమని తెలిసినా, రైల్వే సిబ్బంది ఎంతో శ్రమించి వలస కార్మికులను తరలిస్తోందని తెలిపింది. రాజకీయ ప్రయోజనాల కోసం మంచి వ్యవస్థను అస్థిరపరిచే పనులు చేయొద్దని ఆ లేఖలో ఏఐఆర్ఎఫ్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ విజ్ఞప్తి చేశారు.

కాగా, లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తరలించేందుకు ఈ నెల 1 నుంచి శ్రామిక్ రైళ్లు నడుస్తున్నాయి. రైల్వే అధికారుల ప్రకటన మేరకు నిన్నటి వరకు 1.35 లక్షల మంది వలస కార్మికులను 140 శ్రామిక్ రైళ్ల ద్వారా వారి సొంత రాష్ట్రాలకు తరలించారు.
Go Back to Shorts
AIRF
Sramik trains
Congress
Sonia Gandhi

More Telugu News