Rahul Gandhi: దేశంలో రెండు ఆందోళనకర పరిస్థితులున్నాయి: రాహుల్ గాంధీతో నోబెల్ గ్రహీత అభిజిత్

  • బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టే సమస్య ఉంది
  • ప్రభుత్వానికి రెవెన్యూ పడిపోయే పరిస్థితి ఉంది
  • ప్రజల చేతుల్లోకి డబ్బు వెళ్లేలా చేయాలి
  • భారీ ప్యాకేజీ ప్రకటించాలి
rahul with abhijit

లాక్‌డౌన్‌ నేపథ్యంలో భారత ఆర్థిక పరిస్థితి గురించి నోబెల్ గ్రహీత, ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఈ రోజు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. భారీ ఉద్దీపన ప్యాకేజీను భారత్ ప్రభుత్వం విడుదల చేయాలని అభిజిత్ బెనర్జీ అన్నారు. ఇప్పటికే అమెరికా, జపాన్, యూరప్ దేశాలు ఈ పని చేస్తున్నాయని తెలిపారు. డిమాండ్ మేరకు ప్రజలకు అది చేరాలని, కొనుగోళ్లు ఊపందుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం డిజిటల్‌ పద్ధతుల్లో నగదు బదిలీలు జరిపే విషయం పేదలకు అందనంత దూరంలో ఉందని చెప్పారు.  

అమెరికాలో తీసుకుంటున్న చర్యల మాదిరిగా భారత్‌లోనూ ప్రజల చేతుల్లో డబ్బు ఉండేలా చూడాలని, అప్పుడే కొనుగోళ్లు పెరుగుతాయని అభిజిత్ చెప్పారు. ప్రభుత్వం నుంచి విడుదలైన ప్యాకేజీ పేదలకు మాత్రమే అందాలని, అప్పుడే కొనుగోళ్లు పెరుగుతాయని చెప్పారు. ఇతరులకు డబ్బు అందితే దాన్ని వారు వినియోగించకుండా జమ చేసుకునే అవకాశం ఉంటుందని, దీంతో డబ్బు సర్క్యులేషన్ ఉండదని తెలిపారు. లాక్‌డౌన్‌ను ఎత్తేసే విషయం కరోనా విజృంభణ అంశంపై ఆధారపడి ఉంటుందని అన్నారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలో ప్రధానంగా ఆర్థికంగా రెండు రకాల ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని, వాటిని అధిగమించాల్సి ఉందని రాహుల్ గాంధీతో అభిజిత్ బెనర్జీ చెప్పారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టే సమస్య, ప్రభుత్వానికి రెవెన్యూ పడిపోయే సమస్య ఉందని చెప్పారు. వాటిని అధిగమించాల్సి ఉందని చెప్పారు. ప్రజల చేతుల్లోకి డబ్బు వెళ్లేలా చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకునే అవకాశం ఉంటుందని వివరించారు.

కాగా, లాక్‌డౌన్‌ సడలింపులు, ఎత్తివేత విషయాలను గురించి నిర్ణయాలు తీసుకునే పూర్తి స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని రాహుల్ గాంధీ అన్నారు.

More Telugu News