Telangana: వలస కూలీల కోసం నేటి నుంచి రోజుకు 40 రైళ్లు: కేసీఆర్

From Today Onwards 40 train from Telangana to other States
  • తెలంగాణలో చిక్కుకుపోయిన వివిధ రాష్ట్రాల కూలీలు
  • ఒక్కో రైలులో 1200 చొప్పున రోజుకు 48 వేల మంది
  • పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు
తెలంగాణలో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వరాష్ట్రాలకు పంపేందుకు నేటి నుంచి రోజుకు 40 రైళ్లను నడపనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు రైళ్లు నడుపుతామని అలాగే, హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలతోపాటు వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల తదితర ప్రాంతాల నుంచి కూడా రైళ్లను నడపనున్నట్టు పేర్కొన్నారు. వలస కార్మికుల ఇబ్బందులపై నిన్న ప్రగతి భవన్‌లో కేసీర్ సమీక్షించారు. ఈ సందర్భంగా వారిని స్వరాష్ట్రాలు పంపాలని నిర్ణయం తీసుకున్నారు.

స్వస్థలాలకు వెళ్లేందుకు వివిధ పోలీస్ స్టేషన్లలో పేర్లు నమోదు చేసుకున్న కార్మికులను ఈ రైళ్ల ద్వారా తరలించనున్నారు. కార్మికులను వారి ప్రాంతాలకు తరలించేందుకు చేస్తున్న ఏర్పాట్ల గురించి వారికి వివరించాల్సిందిగా పోలీసులను కేసీఆర్ కోరారు. ఒక్కో రైలులో 1,200 మంది చొప్పున 48 వేల మందిని తరలించే అవకాశం ఉందని అంచనా. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సుల్తానియా, జితేందర్‌రెడ్డిలను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది.
Telangana
Migrant workers
Rails
KCR

More Telugu News