Chuni Goswami: భారత ఫుట్‌బాల్ దిగ్గజం చునీ గోస్వామి కన్నుమూత

Indian Football legend Goswami died
  • 82 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి
  • క్రికెటర్‌గా 46 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు
  • అర్జున అవార్డు, పద్మశ్రీ పురస్కారాలతో సన్మానించిన ప్రభుత్వం
భారత ఫుట్‌బాల్ దిగ్గజం చునీ గోస్వామి 82 ఏళ్ల వయసులో గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. ఉమ్మడి బెంగాల్‌లో జన్మించిన గోస్వామి 1956 నుంచి 1964 మధ్య కాలంలో 50 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 13 గోల్స్ చేశాడు. ఆయన సారథ్యంలోని జాతీయ ఫుట్‌బాల్ జట్టు 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించింది. 1964 ఆసియా కప్‌లో రజతం గెలుచుకుంది. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 1962లో ఆసియా అత్యుత్తమ స్ట్రయికర్ అవార్డు అందుకున్నాడు.

భారత ప్రభుత్వం నుంచి 1963లో అర్జున అవార్డు, 1983లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. గోస్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇండియన్ పోస్టల్ ఈ ఏడాది జనవరిలో ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది.

మరోవైపు గోస్వామి మంచి క్రికెటర్ కూడా. బెంగాల్ తరపున 1962 నుంచి 1973 మధ్య 46 ఫస్ట్‌క్లాస్ మ్యాచులకు ప్రాతినిధ్యం వహించాడు. అతడి సారథ్యంలోని జట్టు 1971-72లో రంజీ సీజన్‌లో ఫైనల్‌కు చేరింది. గోస్వామి మృతికి టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సహా పలువురు క్రీడాకారులు సంతాపం తెలిపారు.
Chuni Goswami
India
Football

More Telugu News