Jagan: ‘కరోనా’ మృతుల అంతిమ సంస్కారాలు అడ్డుకుంటే కఠిన చర్యలు: సీఎం జగన్ ఆదేశాలు

  • కర్నూలు లో ‘కరోనా’ మృతుడి అంత్యక్రియలు అడ్డుకోవడం అమానవీయం
  • అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిపై  ఆప్యాయత చూపాలి  
  • ఎదుటి వారి పట్ల సానుభూతి చూపాలని ప్రజలకు విజ్ఞప్తి
CM Jagan Review on covid 19

కరోనా వైరస్ సోకి చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకున్న సంఘటనపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. ‘కరోనా’ నివారణా చర్యలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈ అంశాన్ని జగన్ ప్రస్తావిస్తూ.. కర్నూలు జిల్లాలో ‘కరోనా’ తో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకోవడం అమానవీయమని, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిపై ఆప్యాయత, సానుభూతి చూపించాల్సింది పోయి వివక్ష చూపడం సరికాదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన వాళ్లు ఉన్నప్పుడు ఎలా స్పందిస్తామో, ఇతరులు ఉన్నప్పుడు కూడా అలాగే స్పందించాలని, ఎదుటి వారి పట్ల సానుభూతి చూపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

‘కరోనా’తో మృతి చెందిన వారి అంతిమసంస్కారాలను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్ ను ఆదేశించారు. వైరస్ సోకితే సరైన చికిత్స, మందులు వాడితే నయమైపోతుందని, భయపడాల్సిన పని లేదని ధైర్యం చెప్పారు. ‘కరోనా’ విషయమై దుష్ప్రచారాలు చేయొద్దని, ఇలాంటి ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More Telugu News