పారిశుద్ధ్య కార్మికులకు పాలు, మజ్జిగ.. పంపిణీ చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల

Director Shekar Kammula contributes mila and butter milk packets
  • వెయ్యి మందికి నెల రోజుల పాటు పాలు, మజ్జిగ పంపిణీ 
  • మంత్రి తలసానితో కలిసి పంపిణీ కార్యక్రమం ప్రారంభం
  • శేఖర్ కమ్ములకు ధన్యవాదాలు చెప్పిన తలసాని
‘కరోనా’ కట్టడి నిమిత్తం పాటుపడుతున్న పారిశుద్ధ్య కార్మికులపై ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రశంసలు కురిపించారు. పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలకు గాను వారికి ‘థ్యాంక్స్’ చెప్పాలనే ఆలోచనతో  ఒక వెయ్యి మందికి నెల రోజుల పాటు పాలు, మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమాన్ని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ,  శేఖర్ కమ్ముల తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నానని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులపై ప్రేమ చూపుతున్న శేఖర్ కమ్ములకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.
 
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, తాను నివసించే  ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులు ఏ విధంగా కష్టపడుతుంటారో రోజూ చూస్తుంటానని చెప్పారు. పాలు, మజ్జిగ ప్యాకెట్లను పారిశుద్ధ్య కార్మికులకు తాము పంచడం కన్నా వారి సిబ్బంది ద్వారా అందించడం వారికి మరింత గౌరవమని భావించి వీటి పంపిణీ కార్యక్రమాన్ని  జీహెచ్ఎంసీకే అప్పగించామని అన్నారు.
Go Back to Shorts
Shekar Kammula
Director
sanitary workers
contribution

More Telugu News