విచక్షణతో ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఎస్ఈసీకి ఉంది: అఫిడవిట్ లో నిమ్మగడ్డ రమేశ్

స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి విచక్షణతోనే వాయిదా వేశానని ఏపీ మాజీ ఎన్నికల కమిషర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఏపీ హైకోర్టులో ఈరోజు ఆయన అఫడవిట్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషనర్ తీసుకునే నిర్ణయాలను ఈసీ కార్యదర్శికి చెప్పాల్సిన అవసరం లేదని అఫిడవిట్ లో ఆయన తెలిపారు. కమిషనర్ కు సాయం చేసేంత వరకే కార్యదర్శి విధులు పరిమితమని చెప్పారు.

ఎన్నికల వాయిదా అనేది చాలా గోప్యంగా ఉండాల్సిన వ్యవహారమని రమేశ్ పేర్కొన్నారు. ఈసీ న్యాయ విభాగం నోటిఫికేషన్ తయారు చేసిన తర్వాతే తాను సంతకం చేశానని చెప్పారు. విచక్షణతో ఎన్నికలను వాయిదా వేసే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఉందని చెప్పారు. ఎన్నికల కమిషన్ సిబ్బందితో ఎలక్షన్లకు సంబంధించిన నిర్ణయాలపై చర్చించాల్సిన అవసరం లేదని తెలిపారు. మరోవైపు ఎస్ఈసీ పదవీకాలం తగ్గింపుపై హైకోర్టులో రేపు వాదనలు జరగనున్నాయి.


More Telugu News