పీఎం గారూ, మీకో సినిమా డైలాగు చెబుతా వినండి: అసదుద్దీన్ ఒవైసీ

  • లాక్ డౌన్ ను మరో 19 రోజులు పొడిగించిన ప్రధాని మోదీ
  • మొఘల్ ఏ అజామ్ చిత్రంలోని డైలాగును గుర్తుచేసిన ఎంఐఎం అధినేత
  • లాక్ డౌన్ నిర్ణయం క్రూరత్వానికి పరాకాష్ఠ అంటూ ఘాటు వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ ను మరో 19 రోజులు పొడిగించడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తనదైన శైలిలో స్పందించారు. ప్రధానమంత్రి గారూ, ఈ సందర్భంగా మీకు మొఘల్ ఏ అజాం చిత్రంలోని డైలాగును గుర్తుచేస్తున్నానంటూ ఓ భారీ డైలాగు విసిరారు.

 "అనార్కలీ... ఇలా జరగకపోతే సలీం నిన్ను చావనివ్వడు, అలాగని మేం నిన్ను బతకనివ్వం" అంటూ సామాన్యుడి దయనీయ స్థితిని దృష్టిలో ఉంచుకుని ఆ ఫేమస్ డైలాగును ట్వీట్ చేశారు.

ఈ డైలాగును ఎందుకు వాడాల్సి వచ్చిందో కూడా అసద్ మరో ట్వీట్ ద్వారా విశదీకరించారు. "దేశంలో అత్యధికులు ఆకలి, నిరాశ్రయం, నిరాశ, నిస్పృహ వంటి దుర్భర దారిద్ర్య పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం వారిని సంపన్నుల విరాళాలకు, దయాదాక్షిణ్యాలకు వదిలేసింది. నిర్భాగ్యులు, అణగారిన వర్గాల వారి గురించి ఏమాత్రం ఆలోచించకుండా తీసుకున్న ఈ లాక్ డౌన్ నిర్ణయం క్రూరత్వానికి పరాకాష్ఠగా నిలుస్తుంది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ప్రధానమంత్రి కార్యాలయం గమనించాలి" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Asaduddin Owaisi
Narendra Modi
Lockdown
Extension
Corona Virus

More Telugu News