కేంద్రం నిర్ణయం ఏదైనా ఆ రాష్ట్రాల్లో లాక్డౌన్ పొడిగించినట్టే
- ఈనెలాఖరు వరకు కట్టడివైపే ఏడు రాష్ట్రాల మొగ్గు
- పంజాబ్, ఒడిశా ఇప్పటికే ప్రకటన
- తాజాగా తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్
కేంద్రప్రభుత్వం విధించిన లాక్డౌన్ గడువు ఈనెల 14తో ముగియనుంది. లాక్డౌన్ పొడిగిస్తారన్న వార్తలు వస్తున్నప్పటికీ కేంద్రం ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. నిన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడుతారని, లాక్డౌన్పై స్పష్టత ఇస్తారన్న వార్తలు నిజం కాలేదు. ఈ నేపథ్యంలో కేంద్రంతో సంబంధం లేకుండా తమ రాష్ట్రాల్లో లాక్డౌన్ను ఈనెలాఖరు వరకు కొనసాగించనున్నట్లు ఈ రాష్ట్రాలు ప్రకటించడం గమనార్హం.
పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు ప్రధానితో సీఎం వీడియోకాన్ఫరెన్స్కు ముందే ఈ ప్రకటన చేయగా, తాజాగా తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు పొడిగింపు నిర్ణయం తీసుకున్నాయి. లాక్డౌన్ సడలింపుపై కేంద్రమే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సీఎంలంతా ప్రధానికి సూచిస్తూనే, అంతకు ముందే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పొడిగింపు ప్రకటన చేయడం గమనార్హం.