AR Rahman: దేవుడు మన హృదయంలోనే ఉన్నాడు, పవిత్రస్థలాల్లో గుమికూడవద్దు: ఏఆర్ రెహమాన్

AR Rahman advise people stay at home and do not gather
  • కరోనా పరిణామాలపై స్పందించిన రెహమాన్
  • ఎవరూ భేషజాలకు పోవద్దని హితవు
  • కనిపించని శత్రువతో యుద్ధం చేస్తున్నామంటూ వ్యాఖ్యలు
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దేశంలో నెలకొన్న తాజా పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు. మతపరమైన పవిత్ర స్థలాల్లో గుమికూడేందుకు ఇది సమయం కాదని, ప్రభుత్వ సూచనలను అందరూ పాటించాలని స్పష్టం చేశారు. దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాడని, ఇలాంటి పరిస్థితుల్లో మానవత్వం మరింత ప్రస్ఫుటించేలా వ్యవహరిద్దామని పిలుపునిచ్చారు. వైరస్ మహమ్మారిపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి రెహమాన్ ధన్యవాదాలు తెలిపారు.

కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామని,  ప్రాణాలను లెక్కచేయకుండా డాక్టర్లు, నర్సులు సేవలు అందిస్తున్న ఈ సంక్షుభిత సమయంలో ఎవరూ భేషజాలకు పోవద్దని హితవు పలికారు. లక్షల మంది ప్రాణాలు మన చేతిలో ఉన్నాయన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని తెలిపారు.  ఢిల్లీలోని నిజాముద్దీన్ లో ఉన్న ఆలమీ మర్కజ్ లో ఇటీవల జరిగిన మతపరమైన కార్యక్రమానికి వేల సంఖ్యలో తబ్లిగీలు హాజరవడం, వారిలో చాలామందికి కరోనా పాజిటివ్ రావడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
AR Rahman
Corona Virus
India
Lockdown
Nizamuddin Markaz
New Delhi

More Telugu News