Andhra Pradesh: ఏపీలో ఇక అన్ని వైద్యవిభాగాలు ప్రభుత్వ అధీనంలోనే... ఉత్తర్వులు జారీ!

State government issues orders on medical services usage
  • కరోనా చికిత్సలో అన్ని వైద్య సంస్థల సేవలు వినియోగం
  • ప్రభుత్వ పరిధిలో రోగ నిర్ధారణ, ఇన్ పేషెంట్ సేవలు
  • జిల్లా కలెక్టర్ల ఆదేశాలతో ప్రైవేటు ఆసుపత్రులు పనిచేయాలని స్పష్టీకరణ
కరోనా వైరస్ మరింతగా విస్తరిస్తుండడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని వైద్య విభాగాలు ప్రభుత్వ అధీనంలోనే పనిచేయాలంటూ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. అన్ని వైద్య సంస్థలను కరోనా చికిత్సకు ఉపయోగించుకునేలా ఆదేశాల్లో పేర్కొన్నారు. దీని ద్వారా కరోనా వైరస్ బాధితులకు మరింత విస్తృతస్థాయిలో సేవలు అందించే వీలవుతుంది. తాజా ఉత్తర్వులతో ప్రైవేటు వైద్య కళాశాలల్లోని ఆరోగ్య సేవలు కూడా ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి.

రోగ నిర్ధారణ పరీక్షలు, ఇన్ పేషెంట్ సేవలు ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. వెంటిలేటర్లు, ల్యాబ్స్, డాక్టర్లు, నాన్ మెడికల్ సిబ్బంది సేవలు వినియోగించుకోవచ్చు. ఏ వైద్య విభాగానికి సంబంధించిన నిపుణులనైనా అవసరమైన చోట తక్షణం సేవలు అందించేలా చేయడం ఈ ఉత్తర్వులతో వీలవుతుంది. ప్రైవేటు ఆసుపత్రులు జిల్లా కలెక్టర్ల ఆదేశాలతో పనిచేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను తక్షణం అమల్లోకి తీసుకొస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
Andhra Pradesh
Corona Virus
Medical Services
Orders

More Telugu News