- 37 బంతుల్లోనే సెంచరీ కొట్టిన హార్దిక్
- ఐదు వికెట్లు కూడా తీసిన పాండ్యా
- డీవై పాటిల్ టీ20 కప్లో ఆల్రౌండ్ షో
గాయం నుంచి కోలుకున్న స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఫిట్నెస్ సాధించిన తర్వాత డీవై పాటిల్ టీ20 కప్లో ఆడుతున్న హర్దిక్ తన బ్యాటింగ్, బౌలింగ్ పవర్తో అదరగొడుతున్నాడు. ఈ టోర్నీలో రిలయన్స్ వన్ టీమ్ తరఫున బరిలోకి దిగిన పాండ్యా మంగళవారం కాగ్ టీమ్తో జరిగిన మ్యాచ్లో 37 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఏకంగా పది సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో కాగ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
దాంతో, రిలయన్స్ టీమ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 252 పరుగుల భారీ స్కోరు చేసింది. తర్వాత బౌలింగ్లోనూ పాండ్యా చెలరేగాడు. ఐదు వికెట్లు పడగొట్టడంతో ఛేజింగ్లో కాగ్ 151 పరుగులకే ఆలౌటై 101 రన్స్ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. పునరాగమనం తర్వాత ఆడిన తన రెండో మ్యాచ్లోనే ఈ రేంజ్లో విజృంభించిన పాండ్యా.. ఈ నెల 12 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్కు ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది.
కాబోయే భార్య ప్రశంసలు
డీవై పాటిల్ టోర్నీలో అదిరిపోయే ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. పాండ్యాకు కాబోయే భార్య, నటి నటాషా స్టాంకోవిచ్ కూడా అతనిపై పొడగ్తల వర్షం కురిపించింది. ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత పాండ్యా పెవిలియన్కు వెళ్తున్న ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసిన ఆమె.. ‘హార్దిక్ కుంగ్ ఫూ పాండ్యా 37 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ద డెడ్లీ హిట్టర్ ఈజ్ బ్యాక్ టు వర్క్’ అని కామెంట్ చేసింది. అలాగే, గర్జిస్తున్న సింహం, మై హార్ట్ ఈజ్ఫుల్ అనే స్టిక్కర్లను కూడా జత చేసింది.