టీవీ సౌండ్ పెంచాడని.. ఇంటి యజమానిని చంపేసిన కిరాయిదారు!

  • పెద్దగా అరుచుకుంటూ గొడవ పడిన దంపతులు
  • టీవీ వినిపించకపోవడంతో సౌండ్ పెంచిన యజమాని
  • గొడవపడి చేత్తో కొట్టి చంపేసిన నిందితుడు
టీవీ సౌండ్ పెంచిన పాపానికి ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరులో జరిగిందీ ఘటన. గోల్‌బంగ్లాకు చెందిన గిర్మాజీ రాజేందర్ (40) ఇంట్లో బాలనర్సయ్య అనే వ్యక్తి కుటుంబంతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. బుధవారం రాత్రి రాజేందర్ కుటుంబ సభ్యులతో కలిసి టీవీ చూస్తున్నాడు. అదే సమయంలో బాలనర్సయ్య తన భార్యతో పెద్దగా గొడవపడుతున్నాడు. వీరు పెద్దపెద్దగా అరుచుకుంటుండడంతో టీవీ సరిగా వినిపించడం లేదు. దీంతో రాజేందర్ సౌండ్ పెంచాడు.

భార్యతో గొడవపడుతుంటే సౌండ్ పెంచాడన్న కోపంతో ఆయన ఇంట్లోకి వెళ్లిన బాలనర్సయ్య అతడితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో రాజేందర్ తలపై బలంగా కొట్టాడు. అంతే, అతడు కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న బాలనర్సయ్య కోసం గాలిస్తున్నారు.

Nizamabad District
Armoor
murder
te

More Telugu News