తీవ్ర విషాదంలోనూ జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడిన బంగ్లాదేశ్ కెప్టెన్

బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో మరపురాని విజయంగా నిన్న జరిగిన అండర్-19 వరల్డ్ కప్ టైటిల్ పోరు నిలిచిపోతుంది. ఓటమి అంచున నిలిచిన జట్టును బంగ్లాదేశ్ కెప్టెన్ అక్బర్ అలీ మొండిపట్టుదలతో ఆడి విజయం దిశగా నడిపించాడు. లక్ష్యఛేదనలో అక్బర్ అలీ చేసిన 43 పరుగులే ఆ జట్టుకు తొలి ఐసీసీ టైటిల్ ను సాధించిపెట్టాయి. అయితే, ఇంత గొప్ప ఇన్నింగ్స్ ఆడిన అక్బర్ అలీ పరిస్థితి తెలిస్తే ఎవరైనా "అయ్యో పాపం!" అనకమానరు. ఎందుకంటే, ఈ టోర్నీ జరుగుతుండగానే అతడి సోదరి ఖదీజా ఖాతూన్ చనిపోయింది. కవల పిల్లలకు జన్మనిచ్చే క్రమంలో ఆమె కన్నుమూసింది.

జింబాబ్వేతో బంగ్లాదేశ్ మ్యాచ్ ను కూడా చూసిన ఆమె, ఆ తర్వాత ప్రసవం సందర్భంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. అయితే సోదరి చనిపోయిన విషయం అక్బర్ అలీకి వెంటనే తెలియలేదు. కుటుంబ సభ్యులు కూడా చెప్పలేదు. ఇతరుల ద్వారా ఆ సమాచారం తెలుసుకున్న అక్బర్ అలీ దిగ్భ్రాంతికి గురయ్యాడు. తనకు ఎందుకు చెప్పలేదంటూ సోదరుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడట. ఏదేమైనా, తీరని విషాదం నడుమ గొప్ప ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు చరిత్రలో మర్చిపోలేని విజయం అందించాడు.

Akbar Ali
Bangladesh
Sister
Dead
World Cup

More Telugu News